కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది: విజయ్‌కి మద్దతుపై డీఎంకే నేత ఆగ్రహం

  • ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తోందని విమర్శ
  • కాంగ్రెస్ క్లిష్టపరిస్థితుల్లో డీఎంకే అండగా నిలిస్తే మోసం చేశారని ఆగ్రహం
  • కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు సహకరించినందుకు మూల్యం చెల్లించుకున్నామన్న టీఆర్ బాలు
ఇన్నాళ్లు తమతో ఉండి, ఇప్పుడు టీవీకే అధినేత విజయ్‌తో కలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడిందని డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు పలికింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు తక్కువపడుతున్నారు.

టీవీకేకు కాంగ్రెస్ మద్దతు పలకడంపై డీఎంకే గుర్రుగా ఉంది. తమిళనాడు ప్రజలు తమ కూటమికి ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని మండిపడ్డారు. డీఎంకే కూటమికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ క్లిష్టపరిస్థితులను, సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడుల్లా మిత్రపక్షంగా డీఎంకే అండగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సహకరించినందుకు తాము ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇప్పుడు అసలు విషయం బోధపడిందని టీఆర్ బాలు అన్నారు.

కాంగ్రెస్, డీఎంకే మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న బంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులతో డీఎంకేకు ఉన్న సంబంధాలను ఆయన ప్రస్తావించారు. డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకి అనునిత్యం మద్దతుగా నిలబడ్డారని అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి వెనుకాడిందని, అలాంటి సమయంలో స్టాలిన్ ఆయన పేరును ప్రతిపాదించారని గుర్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయని, కానీ ఆ పార్టీ మాత్రం నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను శత్రు శిబిరానికి పంపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్మి ఓటేసిన వారిని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ కూడా బీజేపీ లాంటి ఎత్తుగడలనే అనుసరిస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ తనకు నచ్చిన పార్టీకి మద్దతు ఇచ్చే హక్కు ఉన్నదని, కానీ ప్రజాతీర్పును అవమానించకూడదని అన్నారు. ఇలాంటి ఎదురుదెబ్బలు, ద్రోహాలు డీఎంకేకు కొత్త కాదని అన్నారు. కాలమే అనింటికి సమాధానం చెబుతుందని టీఆర్ బాలు అన్నారు.

TR Baalu
DMK
Congress
TVK
Tamil Nadu Politics
MK Stalin
Rahul Gandhi
Assembly Elections

More Telugu News